హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ((89) శనివారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్లోని అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులోని తన స్వగృహంలో ఉదయం అకస్మాత్తుగా బీపీ పడిపోవడంతో కుటుంబసభ్యులు బంజారాహిల్స్లోని స్టార్ హాస్పిటల్కు తరలిస్తుండగా దారిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయం 8.20 గంటలకు రోశయ్య మృతిచెందినట్టు స్టార్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని అమీర్పేటలోని నివాసానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమీర్పేటలోని రోశయ్య నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. రోశయ్య భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం నాంపల్లిలోని గాంధీభవన్కు తరలిస్తారు. మధ్నాహ్నం 12.30 గంటలకు దేవరయాంజాల్లోని ఆయన వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నది. అంత్యక్రియలకు ఏపీ ప్రతినిధులుగా ఆ రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మూడ్రోజులు సంతాపదినాలు ప్రకటించాయి.
దాదాపు ఆరు దశాబ్దాలపాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రోశయ్య సుదీర్ఘకాలం ఆర్థికశాఖతోపాటు అనేక పదవులు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, కర్ణాటక ఇంచార్జి గవర్నర్గా వ్యవహరించారు. ఆయన 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. రోశయ్యకు భార్య శివలక్ష్మి, ముగ్గురు కుమారులు శివ సుబ్బారావు, త్రివిక్రం, శ్రీమన్నారాయణ, కూతురు పైడ రమాదేవి ఉన్నారు. 1959లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన.. ఎన్జీ రంగా ఆశీస్సులతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 1968లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 18 ఏండ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగారు. 1979లో కాంగ్రెస్లో చేరారు. 1983 నుంచి 1985 వరకు మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో వరుసగా ఏడు పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు సృష్టించారు. వైఎస్ మరణానంతరం 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2011 ఆగస్టు నుంచి 2016 వరకు తమిళనాడు గవర్నర్గా వ్యవహరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వరకు ప్రముఖులందరితోనూ ఆయన సన్నిహితంగా మెలిగేవారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు వారి ప్రసంగాలను రోశయ్య అనువదించేవారు. రోశయ్య వ్యంగ్యాస్ర్తాలను తట్టుకోలేక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దుచేశారని చెప్తుంటారు. కాంగ్రెస్లోని గ్రూపులు, ముఠాలకు అతీతంగా వ్యవహరించేవారు. శాసనసభలో ఛలోక్తులు, వ్యంగ్యోక్తులతో నవ్వులు పూయించేవారు. రోశయ్య సభలో లేచి నిలబడగానే ఆయన ఏమి మాట్లాడుతారో అని సభ్యులంతా ఆసక్తిగా వినేవారు. ప్రతిపక్ష నాయకులు సైతం ఆయన మాటలను స్పోర్టివ్గా తీసుకునేవారు.
రోశయ్య మృతిపట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఎన్వీ రమణతోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీ ల నాయకులు రోశయ్య భౌతికకాయం వద్ద పుష్ఫగుచ్ఛాలు ఉంచి, నివాళి అర్పించారు. నివాళి అర్పించినవారిలో మంత్రులు మహమూద్అలీ, తలసాని, సబిత, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, సీహెచ్ మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ప్రభు త్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవి, జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బిగాల గణేశ్గుప్తా, శ్రీధర్బాబు, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వీ హన్మంతరా వు, కోదండరెడ్డి, కేవీపీ రాంచందర్రావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్రావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రులు గీతారెడ్డి, గాదె వెంకట్రెడ్డి, జేసీ దివాకర్రెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి, మండలి బుద్ధప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, టీఎస్ఐఐడీసీ చైర్మన్ బాలమల్లు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తదితరులు ఉన్నారు.
కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖతోపాటు పలు పదవులకు వన్నెతెచ్చారు. సౌమ్యుడిగా, సహనశీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
–ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
కొణిజేటి రోశయ్య విలువలకు ప్రతిరూపంగా నిలిచారు. పరిపాలనాదక్షుడిగా పేరొందిన రోశయ్య మృతి తెలుగువారికి తీరని లోటు. తెలుగు భాష, కళలు, సంస్కృతికి ఆయన పెద్దపీట వేశారు. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
–సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
తెలుగు రాష్ట్రాలకు పెద్దదిక్కు రోశయ్య. రాజకీయాల్లో అజాతశత్రువు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం సందర్భంగా రోశయ్యను కలిశాం. ఆయన మద్దతు కోరాం. ఆయన స్థాయికి తగ్గట్టుగా అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడ్రోజులపాటు సంతాపదినాలు ప్రకటించింది. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
–టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే తారకరామారావు
రోశయ్య మరణం చాలా బాధాకరం. ఆయనతో నాకు దగ్గరి అనుబంధం ఉండేది. అందరి ముఖ్యమంత్రుల మెప్పు పొందారు. ప్రతిపక్షాలను సైతం ఒప్పించి, మెప్పించగల నేర్పరి. అనేక పదవులకు ఆయన వన్నె తెచ్చారు.
–ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు