Telangana | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు కొనసాగనున్నారు. దశాబ్ది ఉత్సవాల కమిటీ కన్వీనర్గా ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ వ్యవహరించనున్నారు.
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ వరకు, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.