యాసంగి ధాన్యం విక్రయానికి నిబంధనలు రూపొందించేందుకు.. 25వ తేదీ సాయంత్రం 6.47 గంటలకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ.. రాత్రి 11.52 గంటలకు ధాన్యం విక్రయానికి నోటిఫికేషన్ జారీచేసిన పౌరసరఫరాల సంస్థ.. రాత్రి 11.55 నుంచి వేలానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): కేవలం ఐదు గంటల వ్యవధిలో మొత్తం తతంగం పూర్తయింది. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ సభ్యులకు సమాచారం అందడం, ఆ కమిటీ భేటీ కావడం, నిబంధనలపై చర్చించడం, నివేదిక రూపొందించడం, రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందించడం, ప్రభుత్వం దానిని ఆమోదించడం, ఆ వెంటనే నోటిఫికేషన్ జారీచేయడం, వేలానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం.. ముఖ్యమైన విషయాలన్నీ ఇలా ఐదు గంటల వ్యవధిలోనే ఆగమేఘాల మీద పూర్తికావడం ఆశ్చర్యపరుస్తున్నది. సాయంత్రం కమిటీ వేస్తే అర్ధరాత్రి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావడంపై నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు.
‘అతి’వేగం ఎవరి కోసం?
2022-23 యాసంగి సీజన్కు సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయానికి పౌరసరఫరాల సంస్థ గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు ఈ నెల 25న సీఎస్ శాంతికుమారి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచిత్రంగా అదేరోజు అర్ధరాత్రికి ధాన్యం వేలానికి సంబంధించి పౌరసరఫరాల సంస్థ నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈ హైస్పీడ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంత అర్జెంటుగా చేయాల్సిన పనికాకుండా ఆగమేఘాల మీద అన్ని పనులు పూర్తికావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అతివేగపై పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు స్పందిస్తూ తమ సంస్థ ఇప్పుడు జెట్ స్పీడ్తో పనిచేస్తున్నదని సెటైర్ వేశారు.
ముందే పూర్తయిన తంతు!
అధికారంలోకి వచ్చీరాగానే యాసంగి ధాన్యం విక్రయంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ 27న పౌరసరఫరాలశాఖ కమిషనర్గా నియమితులైన ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ ధాన్యం విక్రయంపై కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పదిహేను రోజులుగా అధిక సమయాన్ని కేటాయించి మరీ నిబంధనలు రూపొందించారు. కమిటీ ఏర్పాటు, అందులో ఎవరు ఉండాలి? అన్నదానిపై ప్రభుత్వం ముందే స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. దీంతో మొత్తం కార్యాన్ని ముందే పూర్తిచేయడంతో ప్రభుత్వం నుంచి కమిటీ ఏర్పాటుకు ఉత్వర్వులు వచ్చిన తర్వాత ‘మమ’ అనిపించారు.
అప్పుడు విమర్శించి.. ఇప్పుడు అదే చేసి
2022-23 యాసంగి సీజన్లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి 66.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయానికి ఇప్పట్లానే అప్పట్లోనూ గ్లోబల్ టెండర్లు పిలిచింది. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ధాన్యం వేలాన్ని నిలిపివేయాలన్న కాంగ్రెస్ లేఖతో ఎన్నికల సంఘం ఆ వేలాన్ని ఆపేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగా ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. అప్పుడు 25 లక్షలు టన్నులు విక్రయించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తే ఇప్పుడు మరో పది పెంచి 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయానికి టెండర్లు పిలవడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతున్నది.