PCCF | తెలంగాణలో పచ్చదనం మరింత పెంచాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ, నిర్వహణపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్షాప్ హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ శాఖ పనితీరు, నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
అటవీ నిర్వహణలో ఈ ఏడాది లక్ష్యాలు, ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై చర్చించారు. తొలిరోజు సదస్సులో తెలంగాణకు హరితహారం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్వహణ, అటవీ సంరక్షణ చట్టం, అభివృద్ధి పనులకు అటవీ భూముల మళ్లింపు, అటవీ రక్షణ- విజిలెన్స్, రెండోరోజు పరిపాలన, ప్రత్యామ్నాయ అటవీకరణ (కంపా), ఎకో టూరిజం, ప్రొడక్షన్ తదితర అంశాలపై చర్చించారు.
సంబంధిత విభాగాల పర్యవేక్షకులుగా ఉన్న ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా పురోగతిని సమీక్షించారు. సదస్సులో పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) సువర్ణ, పీసీసీఎఫ్ (ఎఫ్సీఏ) ఎంసీ పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్లు వినయ్ కుమార్, సునీతా భగవత్, చీఫ్ కన్జర్వేటర్లు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్లు, అన్ని జిల్లాలకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్లు, డివిజనల్ అధికారులు హాజరయ్యారు.