హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వేటగాళ్లను వేటాడేందుకు రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. వన్యప్రాణుల వేట నిరోధానికి ‘క్యాచ్ ద ట్రాప్’ కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్వైర్లు, విష, పేలుడు పదార్థాల వంటివి ఉపయోగించేవారిని వలపన్ని పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
అడవి జంతువుల బారి నుంచి పంటనష్టాన్ని నివారించేందుకు, వాటి మాంసాన్ని విక్రయించేందుకు సాగిస్తున్న వేటకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతోపాటు వారి పరికరాలను స్వాధీనం చేసుకోనున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి, పరికరాలను స్వాధీనం చేసుకోనున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాలను సరిగా రికార్డ్ చేయడంతోపాటు సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్ తరలించనున్నారు. స్పెషల్ డ్రైవ్లో అత్యుత్తమ పనితీరు కనబరిచే సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించనున్నారు.
వేటగాళ్ల సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకు ఉపయోగించే వస్తువుల సమాచారాన్ని జిల్లా అటవీ అధికారికి లేదా 98033 38666 నంబర్కు, లేదా టోల్ఫ్రీ నంబర్ 18004255364కు తెలుపవచ్చని అటవీశాఖ సూచించింది.