నిజామాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అడవులను కాపాడాల్సిన అధికారే అక్రమాలకు తెర లేపాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను అడవిలో ఓ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు రూ.30 వేల లంచాన్ని డిమాండ్ చేయడంతోపాటు రూ.40 వేల విలువైన టేకు దుంగ కావాలంటూ ఓ రైతులతో బేరసారాలకు దిగాడు. చివరికి ఆ రైతును ‘కనికరించి’ రూ.20 వేలు పుచ్చుకునేందుకు అంగీకరించాడు. బుధవారం కామారెడ్డి బస్టాండ్ వద్ద ఆ లంచాన్ని తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఆయనను కరీంనగర్లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడితే 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.