హైదరాబాద్,జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. శనివారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సందేశం విడుదల చేశారు. పెద్దపులుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన మేనేజ్ మెంట్ ఎఫెక్టివ్ నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఈఈ) నివేదికలో టైగర్ రిజర్వుల నిర్వహణలో రాష్ట్రానికి చెందిన అమ్రాబాద్ 78.7 శాతం సోర్తో వెరీగుడ్ క్యాటగిరీలో, కవ్వాల్ 74.2 శాతం సోర్తో గుడ్ క్యాటగిరీలో నిలిచినట్టు తెలిపారు. రాష్ట్రంలో అటవీ విస్తరణ, సమృద్ధి ఆహారం, నీటివనరుల కల్పనతో పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా అడవుల్లోని పులులు ఇకడకు తరలి వస్తున్నాయని తెలిపారు. గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికి కలిసి వస్తున్నదని వివరించారు. వన్య ప్రాణులు, మానవుల నడుమ సంఘర్షణను నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్న రాంపూర్, మైసంపేట గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు పునారావాస ప్యాకేజీ కల్పించి మరో ప్రాంతానికి తరలించామని వివరించారు. జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని సూచించారు. పర్యావరణ వ్యవస్థల్లో పులులు పోషించే కీలక పాత్రను గుర్తించాలని కోరారు.