యాదాద్రి, జనవరి 4: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యుత్తమ, అధునాతన హంగులతో అన్నదాన, ప్రసాద నైవేద్యాల తయారీలో శుచీశుభ్రతతోపాటు పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు కేంద్ర ఫుడ్ సేఫ్టీ బృందం గుర్తించినట్టు బోగ్ ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి తెలిపారు. ఇండోర్ నుంచి కేంద్ర ఫుడ్ సేఫ్టీ ఆడిటర్ వికాస్ మిశ్రా, ట్రైనర్ చాగంటి ఆంజనేయులు, డిసిగ్నేటెడ్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, అధికారి పీ స్వాతి బుధవారం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానంలోని అన్నదానం, రామానుజ కూటం, ప్రసాద తయారీ, వివిధ వంటశాలలు, ఆహార పదార్థాల నాణ్యత తయారీలో ఆచరిస్తున్న పద్ధతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సురక్షిత, పరిశుభ్రమైన ప్రసాదాల తయారీపై సిబ్బందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేశారు. అనంతరం ఆలయ ఈవో గీత, డీఈవో భాస్కర్తో కలిసి ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ సాధించుకునేలా ప్రసాదం తయారీ, అన్నదానం జరిపే విధానం, నాణ్యతా ప్రమాణాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శ్వేతామహంతి ఆదేశాల మేరకు ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల పర్యవేక్షణలో రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాయాలను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ను ప్రదానం చేస్తారని వివరించారు. ఇందులో భాగంగా చివరిసారిగా జరిగిన ఆడిట్లో యాదగిరిగుట్ట ఆలయంలో భగవంతుడికి అర్పించే నైవేద్యం, భక్తులకు అందజేసే ప్రసా దం, అన్నదాన తయారీలో సురక్షిత, ఆరోగ్యకరమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. దేవస్థానంలో పూర్తి ఆరోగ్యకరమైన ప్రమాణాలు పాటించేలా, దేవాయాల ప్రతిష్ఠను పెంపొందించేలా బోగ్ ఇనిషియేటివ్ నిర్వహించ గా.. ఆలయంలో నాణ్యతా ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉన్నాయని కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. త్వరలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ అందజేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సర్టిఫికెట్ పొందిన దేవాలయంగా యాదగిరిగుట్ట నిలువనున్నదని చెప్పారు.