హైదరాబాద్ : రైతులకు మెరుగైన ధరలు, వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించిందని తెలిపారు. ప్రతి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో కోల్డ్ స్టోరేజి సౌకర్యాలు, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లు, కనీస వసతులు కూడా ఉంటాయని సీఎస్ స్పష్టం చేశారు.
శుక్రవారం నగరంలోని ఓ ప్రయివేటు హోటల్లో తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (FTCCI) కలిసి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం సాగునీటి వసతుల కల్పనపై దృష్టి సారించిందని, తద్వార వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని అన్నారు. ప్రస్తుతం రైతుల ఉత్పత్తులకు అదనపు ఆదాయంపై దృష్టి సారించిందని, ఈ ప్రక్రియలో వ్యాపారవేత్తలు కీలకపాత్ర పొషించాలని సూచించారు.
ఈ సందర్భంగా వ్యాపార వేత్తలకు తలెత్తిన సందేహాలను సీఎస్ నివృత్తి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రైవేట్ వ్యాపార వేత్తలను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ పాలసీ ఉద్దేశమని సీఎస్ స్పష్టం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారికి సరైన సమయంలో మరొకసారి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జయేశ్ రంజన్, FTCCI ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ అగర్వాల్, అనిల్ కుమార్ గవార్ పాల్గొన్నారు.