హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటన మరువకముందే, బుధవారం మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆవేదన వ్యక్తంచేశారు. పదేపదే ఇ లాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం శోచనీయమని ఎక్స్ వేదికగా విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో అసలేం జరుగుతున్నది? విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా? పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కూడా సర్కారుకు చేతకాదా? అని మండిపడ్డారు. చదువుకొనడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత హేయమని పేర్కొన్నారు. సాకులు చెప్తూ తప్పించుకోవడం సర్కార్కు అలవాటైపోయిందని దుయ్యబట్టారు. విద్యార్థుల ప్రాణాలు, తల్లిదండ్రుల ఆవేదనను గమనంలోకి తీసుకొని సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.