Suryapet | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వారిని పక్కనే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కు తరలించారు. చికిత్స అందించిన విద్యార్థినులు కోలుకోకపోవడంతో అధికారులకు సమాచారం అందివ్వగా.. వారిని సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. విద్యార్థినులకు ఆసుపత్రి పాలైనా తల్లిదండ్రులకు మాత్రం సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు. వారంతా ఎక్కడ చికిత్స పొందుతున్నారనే సమాచారం కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదు.
ఒకరికే జ్వరం వచ్చిందని.. టాబ్లెట్ ఇచ్చి పంపారని చెప్పడం ప్రస్తావనార్హం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారనే సమాచారంతో మీడియా అక్కడికి వెళ్లింది. మీడియా అక్కడికి చేరుకొని ఆరా తీశారు. ఆర్డీవో వేణు మాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శంకర్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారు. ఇక సమాచారం అందుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో పిల్లలకు సరిగా భోజనం పెట్టడం లేదంటూ మండిపడ్డారు. గతంలోనూ తెలంగాణ వ్యాప్తంగా పలు పాఠశాలలు, వసతి గృహాల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. తరుచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి మార్పులు రాకపోవడం గమనార్హం. అధికారులతో పాటు ప్రభుత్వం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.