హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : దేశంలో టమాటా, పుచ్చకాయ, బీరకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్ వంటి పంటల్లో హైబ్రిడ్ రకాల కొరత ఉన్నదని, వాటిపై పరిశోధన కేంద్రాలు దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు కోరారు. రాజేంద్రనగర్లో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏఐసీఆర్పీ ఆన్ వెజిటేబుల్ క్రాప్స్ ఐకార్-ఐఐవీఆర్, కూరగాయల పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు జరిగిన అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ పరిశోధన కేంద్రాలు పలు అంశాలపై నివేదికలు సమర్పించి పలు తీర్మానాలు ఆమోదించాయి.
ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. వేరుకుళ్లు, అగ్గితెగులును తట్టుకునే హైబ్రిడ్ రకాలపై పరిశోధనలు జరుగాలని సూచించారు. ఇందుకోసం ఏఐ సహాయాన్ని తీసుకోవాలన్నారు. ఏఐసీఆర్పీ కేంద్రాల్లో వ్యాధి నిఘా డాటా, ఛాయాచిత్రాల రికార్డు కోసం జీపీఎస్ కో-ఆర్డినేటర్లు తప్పనిసరని తెలిపారు. ఇక్కడ ఐసీఏఆర్-ఏడీజీ సుధాకర్ పాండే, తెలంగాణ హార్టికల్చరల్ వర్సిటీ వైస్ చాన్స్లర్ డీ రాజిరెడ్డి, ఏఎన్డీయూఏటీ వీసీ బీ సింగ్, ఐఐవీఆర్ డైరెక్టర్ రాజేశ్కుమార్, బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ డైరెక్టర్ టీకే బెహరా, ఎన్బీపీజీఆర్ డైరెక్టర్ జీపీ సింగ్, మాజీ వైస్చాన్స్లర్ లావాండే, ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ శేషు మాధవ్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.