హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద నిలకడగా కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. జూరాలకు వరద స్థిరంగా వస్తున్నది. శ్రీశైలానికి ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం సాయంత్రానికి 82 వేల క్యూసెక్కులకు చేరుకున్నది. నాగార్జునసాగర్కు వరద నామమాత్రంగానే కొనసాగుతున్నది. మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు భారీగా తగ్గిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తున్నది. సోమవారం సాయంత్రానికి 40 మీటర్లకు పడిపోగా, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను తొలగించారు.
సముద్రంలోకి 1070 టీఎంసీలు
ఈ ఏడాది జూలై 18 నుంచి ఇప్పటివరకు మొత్తంగా గోదావరి నుంచి 1,070 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి తరలిపోయాయి. సగటున రోజున 50 టీఎంసీలకుపైగా వరద వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. గోదావరి నుంచి 150 టీఎంసీలు కూడా మించకపోగా, దిగువన ప్రాణహిత నుంచే 650 టీఎంసీలకు పైగా జలాలు తరలిపోవడం గమనార్హం.