Delhi Floods | న్యూఢిల్లీ, జూలై 16(నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీని వరద భయం వెంటాడుతూ నే ఉన్నది. వరద కాస్త తగ్గినా ఇంకా అక్కడ పరిస్థితులు కుదుటపడలేదు. శనివారం రాత్రి మళ్లీ భారీ వర్షం కురవడంతో ఢిల్లీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోసారి వరదలు ముంచెత్తుతాయేమోననే భయాందోళన లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యమునా న ది ఇంకా శాంతించలేదు. ఆదివారం ఉదయం నీటిమట్టం 205.98 మీటర్ల వద్ద నమోదైంది. ప్రమాదకర నీటిమట్టం స్థాయి 205.33 మీటర్లకు రావాలంటే ఇంకాస్త సమయం పట్టవచ్చు. మళ్లీ వర్షం కురవకపోతే ఆదివారం రా త్రికి 205.70 మీటర్లకు యమునా నీటిమట్టం చేరుకునే అవకాశం ఉన్నది. అనేకమంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మొరాయించిన యమునా నది బ్యారేజ్ ఐదు గేట్లను తెరిస్తే కొంతమేరకు నది ప్రవాహం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. గేట్లను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కాగా, యుమునా తీరంలోని మెట్రో స్టేషన్ తెరుచుకున్నది.
యూపీలో పది మంది మృతి
ఉత్తరాదిలోని పలు రాష్ర్టాల్లో వరదలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో వరద తీవ్రత తగ్గలేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడు ప్రాంతాల్లో జాతీయ రహదారి మూతపడింది. హిమాచల్ప్రదేశ్లో వరదల వల్ల సుమారు రూ.8 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. సిమ్లా, చంబాకాంగ్రా, సిర్మౌర్, కులు జిల్లాల ప్రజలు సోమవారం వరకు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. రాజస్థాన్లోని 15 జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. అస్సాంలోని ఓ డివిజన్లో 40కి పైగా గ్రామాలు నీటమునిగాయి. పంజాబ్లోని దాసుయ సబ్డివిజన్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలు నీటమునిగాయి.