ఆత్మకూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద పూర్తిగా తగ్గింది. 8,251 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా బుధవారం గేట్లు మూసేసిన పరిస్థితుల్లో గురువారం విద్యుదుత్పత్తికి సైతం నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో కేవలం ఎత్తిపోతలకు, ఆయకట్టు కాలువలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు విద్యుదుత్పత్తి కోసం జరిగిన విడుదల ఆ తర్వాత పూర్తిగా నిలిపివేశారు. దీంతో స్వల్ప వరద కారణంగా విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కోయిల్సాగర్ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 808, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు ఉండగా సాయంత్రం 6 గంటలకు 7.836 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవుట్ఫ్లో 2.621 క్యూసెక్కులగా నమోదైంది.