నాగార్జునసాగర్లో ఆరు గేట్లు ఎత్తివేత
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. అల్మట్టి, నారాయణపుర, జూరాల, తుంగభద్ర, పులిచింతల ప్రాజెక్టులకు సగటున 60 నుంచి 70 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్నది. ఆదివారం శ్రీశైలానికి 80 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, సోమవారం 1.40 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. జలాశయంలో ప్రస్తుతం 211.48 టీఎంసీల నీరున్నది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 94 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఆరు క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా అంతే మొత్తంలో పులిచింతలకు వదులుతున్నారు. సాగర్లో నీటిమట్టం ప్రస్తుతం 589.90 (311.74 టీఎంసీలు) అడుగులకు చేరింది. పులిచింతలలో 16వ గేటు స్థానంలో స్టాప్లాక్ ఏర్పాటు చేయడంతో తర్వాత సోమవారం సాయంత్రానికి 147.472 అడుగుల వద్ద 13.566 టీఎంసీల నీరు నిలిచింది. గోదావరి బేసిన్లో మహారాష్ట్రలోని బాలేగావ్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఎస్సారెస్పీకి 14,817 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 (90.313 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 1089.30 అడుగుల (81.178 టీఎంసీలు) వద్ద నీటి నిల్వ ఉన్నది.