మహబూబ్నగర్ : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 34,436 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 33,945 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 105.788 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1633 అడుగులకు చేరినట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్కు ఇన్ఫ్లో 39,036 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 38,600 క్యూసెక్కులుగా నమోదైనట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఆయకట్టుకు 436 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ప్రస్తుతం 10.6 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. రాజోళి మండలంలోని సుంకేసుల డ్యాంకు 40 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. 9 గేట్లను మీటర్ ఎత్తుకు ఎత్తి దిగువకు 38,493 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు డ్యాం జేఈ రాజు తెలిపారు.
జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా 40 గేట్ల నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో 2,10,193 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయానికి 2,89,099 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 2,86,529 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది. 8 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.