హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న తెలంగాణ ప్రాంతాల్లో సత్వరమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఎన్జీటీ ఆదేశించిన మేరకు కిన్నెరసాని, ముర్రేడువాగు సహా మొత్తం 35 వాగుల ప్రవాహాలపై పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు సంయుక్త సర్వేను నిర్వహించాల్సిందేనని నొక్కిచెప్పిం ది. ఈ మేరకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సోమవారం ఘాటైన లేఖను రాశారు. ఇటీవల నిర్వహించిన పీపీఏ సమావేశంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దీనికి ఏపీ అడ్డుచెప్పడాన్ని, గతంలో ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని పీపీఏ కూడా వంతపాడటాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి లేఖను రాసింది. ముంపు ప్రభావానికి సంబంధించిన అంశాలను 2020 జనవరిలోనే పీపీఏ సమావేశంలో ప్రస్తావించామని, వాటిని ఏపీ సైతం గుర్తించిందని పేర్కొన్నది. ముర్రేడువాగు, కిన్నెరసానితోపాటు, ఇతర అన్ని వాగులపై ముంపు ప్రభావాన్ని అధ్యయనం చేయాలని, అందుకు సంయుక్త సర్వే నిర్వహించడంతోపాటు ఆరేండ్లలో డీమార్కేషన్ను పూర్తిచేయాలని అదే ఏడాది సెప్టెంబర్లో ఎన్జీటీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆ లేఖలో గుర్తుచేసింది. ఈ విషయమై పీపీఏకు 11 లేఖలు రాశామని, సీడబ్ల్యూసీకి సైతం విన్నవించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తింది.