పెద్దపల్లి : తెలంగాణలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రానికి జాతీయ అవార్డుల వెల్లువ కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వెల్లడించారు.శనివారం జిల్లా కలెక్టరేట్ లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ పంచాయతీ వికాస్ పురస్కారం క్రింద తొమ్మిది అంశాల్లో ఎంపికైన పంచాయతీలకు జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ అవార్డు(National awards)ల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలకు అవార్డులను ప్రదానం చేశారు.
మంత్రి మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధుల సమష్టి కృషి ఫలితంగా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్(CM KCR) ప్రారంభించిన పల్లె ప్రగతి వల్ల రాష్ట్రంలోని పల్లెల స్వరూపం పూర్తిగా మారిపోయిందని తెలిపారు.ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్(Dumping Yard) నిర్మాణం, ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, కంపోస్ట్ షెడ్డు, నర్సరీ, వైకుంఠధామం నిర్మాణం వంటి వసతులు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం గర్వకారణమని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలు రాష్ట్రంలోనే టాప్ 3 లో ఉంటున్నాయని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, కమిషన్ సభ్యురాలు కటారి రేవతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్పర్సన్ రేణుక, ఎంపీడీవోలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.