హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఉట్నూర్ – ఆదిలాబాద్ మధ్య రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని అధికారులు బయటకు వదులుతున్నారు.
అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంజీర నది ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలకు నదిలోకి వరద తరలివస్తున్నది. మోర్గీ వంతెన వద్ద మంజీర నది ఉరకలేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. వానకు పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పెద్దపేట వంతెన కొట్టుకుపోయి మహదేవ్పూర్ – పలిమెల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. విద్యుత్ సరఫరా లేక అవస్థలకు గురవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందులో వర్షాలకు సింగరేణి ఏరియాలోని ఓపెన్కాస్ట్లో వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నది. ఇల్లెందు పదో గనిలో 10వేల టన్నుల ఒగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నది. టేకులపల్లి కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 40వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీసే పనులకు అంతరాయం కలుగుతున్నది.