ఆత్మకూరు/శ్రీశైలం, జూన్ 15: స్థానికంగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. బుధవారం ఉదయం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు ఎగువన వర్షాలు కురిశాయి. దీంతో జూరాలకు 3 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తికి 6 వేల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ఎగువ, దిగువ జూరాలలోని ఒక్కో యూనిట్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఎగువ జూరాలలో ఒక్కరోజులో 0.700 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. దిగువ జూరాలలో 0.798 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. జూరాల ఎడమ కాలువకు 45 క్యూసెక్కులు, కుడి కాలువకు 20 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 50 క్యూసెక్కులు విడుదల చేశారు. మొత్తంగా 6,605 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైనట్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతున్నది. ప్రస్తుతం 23,464 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6,300 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,554 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 8,760 క్యూసెక్కులు వరద వస్తున్నది.