మహిళా సంఘాల ఉత్పత్తులకు పాన్-ఇండియా మార్కెట్
ఇలాంటి ఎంవోయూ దేశంలోనే తొలిసారి
140 రకాల ఉత్పత్తులు ఆన్లైన్లో అమ్మకం
40 కోట్ల మంది వినియోగదారులకు చేరువ
ఈ ఏడాది రూ.500 కోట్ల వ్యాపారమే లక్ష్యం
ఎస్హెచ్జీ రుణాల లక్ష్యం రూ.18 వేల కోట్లు
తెలంగాణ మహిళాసంఘాల విజయానికి
ఈ ఒప్పందం ఓ ఉదాహరణ: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకొన్నది. దాదాపు 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫాంపై మార్కెట్ చేసేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ తరహా ఒప్పందం దేశంలో ఇదే మొదటిది. శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో సెర్ప్, ఫ్లిప్కార్ట్ అధికారులు ఒప్పంద (ఎంవోయూ) పత్రాలు మార్చుకొన్నారు.
రూ.500 కోట్ల వ్యాపారమే లక్ష్యం
రైతులు పండించిన పంటలకు దళారుల బెడదను తొలగించేందుకు ఫ్లిప్కార్ట్-సెర్ప్ ఒప్పందం ఉపయోగపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. రాష్ట్రంలో మహిళా సంఘాలు బలంగా ఉన్నాయని, వారు తలుచుకొంటే ఏదైనా సాధిస్తారని తెలిపారు. ప్లిప్కార్ట్-సెర్ప్ ఒప్పందం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మల్టీ నేషనల్ కంపెనీ మహిళా స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకోవడం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఒప్పందం కుదిరిందని, ఫ్లిప్కార్ట్తో ప్రయా ణం మహిళా సంఘాలకు, రైతులకు ఎంతో లాభం చేకూరుస్తుందని చెప్పారు. మన మహిళా సంఘాలకు దేశంలోనే మంచి పేరున్నదని, వ్యవసాయ, ఇతర ఉత్పత్తుల రంగంలోకి మహిళలు వచ్చారని వెల్లడించారు. తీసుకొన్న రుణాలను మహిళా సంఘాలు వంద శాతం గ్యారంటీగా చెల్లిస్తున్నాయని గుర్తుచేశారు. బ్యాంకులు ఎలాంటి గ్యారంటీ లేకుండానే మహిళలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. గత ఏడాది రూ.15 వేల కోట్ల రుణాలు ఇస్తే, ఈ ఏడాది రూ. 18 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకొన్నామని వివరించారు. ఫ్లిప్కార్ట్తో ఒప్పందానికి 140 రకాల ఉత్పత్తులను గుర్తించారని తెలిపారు.
ఈ ఒప్పందం రైతులు, మహిళలు, ఫ్లిప్కార్ట్, వినియోగదారులకు అందరికీ ఉపయోగకరంగా ఉం టుందని అన్నారు. ఫ్లిప్కార్ట్ సంస్థ ఒప్పందం వల్ల మరిన్ని కంపెనీలు ఇలాంటి ఒప్పందాల కోసం ముం దుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బియ్యం, పసుపు, మిర్చి, పండ్లు, పప్పుధాన్యాలు, సీజనల్ ఉత్పత్తులను కంపెనీకి విక్రయించి రైతు సంఘాలు లాభాలబాటలో పయనించాలని సూచించారు. ప్రపంచంలో ఎకడా లేని రీతిలో రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేసుకొన్నామని తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, సీవోవో రజిత, ఫ్లిప్కార్ట్ అసోసియేట్ డైరెక్టర్ గిరిధర్, అన్ని జిల్లాల డీఆర్డీవోలు, అదనపు డీఆర్డీవోలు, రైతు ఉత్పాదక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
50 రోజుల్లో 40 కోట్ల వ్యాపారం
ఎఫ్పీసీ ద్వారా మొదటి సంవత్సరం రూ.30 లక్షల వ్యాపారం చేశాం. ఈ వ్యాపారాన్ని పెంచుకుం టూ నిరుడు 50 రోజుల్లోనే రూ.40 కోట్ల వ్యాపారం చేశాం. ఈ సంవత్సరం రూ.100 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. మిర్చి కొనుగోలు ద్వారా మా ఎఫ్పీసీకి రూ. 96 లక్షల లాభం వచ్చింది. ఎఫ్పీసీల ద్వారా రైతులు పండించిన పంటలు కొనడంతో మా కు, రైతులకు లాభం వస్తున్నది. కంపెనీలకు కూడా నాణ్యమైన సరుకు దొరుకుతుంది. తేజ మిర్చి రకాన్ని ప్లాంట్ లిపిడ్స్ సంస్థకు విక్రయించాం. ఈ సంవత్సరం 10 వేల టన్నులు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. పెసలు, కందులు, ఇతర పంటలు కూడా విక్రయించడానికి రైతులను ప్రొత్సహిస్తాం.
– స్వర్ణ కృష్ణవేణి, సిరివెన్నెల ఎఫ్పీసీ అధ్యక్షురాలు, ఖమ్మం జిల్లా
తెలంగాణలోనే తొలిసారి
ఈ తరహా ఒప్పందం చేసుకొన్న తొలి రాష్ట్రం తెలంగాణే. ఇలాంటి ఒప్పందాల కోసం 15 నెలల క్రితం మూడు రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించాం. తెలంగాణ రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన అద్భుతంగా ఉండటంతో మొదట తెలంగాణతో ఒప్పందం కుదిరింది. భౌగోళికంగా కూడా వ్యాపారానికి తెలంగాణ అనువైనది. ఇక్కడి మహిళా సంఘాలు చాలా బలంగా, చైతన్యవంతంగా ఉన్నాయి. వీరి అనుభవం మా కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడి మోడల్ను ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి కృషి చేస్తాం. మాకు రీ ప్యాకేజింగ్ సెంటర్స్ (ఆర్పీసీ) ఉన్నాయి. ఆర్పీసీల్లో పనిచేసే వారు అత్యధికం స్థానిక మహిళలే.
– స్మృతి రవిచంద్రన్, ఫ్లిప్కార్ట్ ఉపాధ్యక్షురాలు (గ్రాసరీ)