హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగనున్న ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాకు ఏమిస్తావ్ అంటూ కేంద్ర హోం మంత్రిని ప్రశ్నిస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఫ్లెక్సీలు వెలిసాయి. గోవా లిబరేషన్ డేకు కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఇచ్చింది. మరి తెలంగాణ విమోచన దినం అంటూ ఎందుకు ఒక్కరూపాయి ఇవ్వలేదు? అమిత్ షా తెలంగాణకు ఇవాళ ఏమైనా ఇస్తారా అంటూ టివోలీ చౌరస్తాతోపాటు పరేడ్ మైదానం చుట్టూ పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ నెల 15న కూడా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏవిధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో కొందరు పోస్టర్లు అంటించారు. కంటోన్మెంట్ యువత పేరుతో ఉన్న ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లేనంటూ మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలను పొందుపరిచారు.