నిజామాబాద్: పసుపు బోర్డుకు (Turmeric board) పంగనామం పెట్టడంపై బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ (Nizamabad) రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ (Anupriya Patel) పార్లమెంటులో చేసిన ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇవి ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్కు పసుపుబోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అరవింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపర్ రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమేకాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్టు ఉండడం పట్ల రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నరేండ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్, రామ్మాధవ్ వంటివారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని స్పష్టంచేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదంటున్నారు.