హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త విద్యుత్తు కనెక్షన్ల జారీకి ఈఆర్సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు విద్యుత్తు లైన్ నుంచి వినియోగదారుడి ఇంటి వరకు లైన్ వేసేందుకయ్యే వ్యయాన్ని వినియోగదారులే భరించాల్సి వచ్చేది. విద్యుత్తు స్తంభాలు, లైన్ల ఏర్పాటు కోసం దూరాన్ని బట్టి అధికారులు అంచనాలు రూపొందించే వారు. వాటి ఆధారంగా వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేసేవారు. కానీ, ఇక నుంచి ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవు.
వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి అన్ని లోడ్లకు కిలోవాట్కు రూ.1,000 మాత్రమే వసూలు చేస్తారు. అయితే ఈ మార్గదర్శకాల పేరిట టర్న్కీ విధానాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదని, దీంతో అన్ని పనులు డిస్కమ్ అధికారుల చేతుల్లోకి వెళ్తాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అవసరమైన మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లను డిస్కమ్లు అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం పనులు డిస్కమ్ అధికారులే చేయడం సాధ్యపడదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. నూతన విధానాన్ని నిరసిస్తూ పోరాటానికి దిగుతామని విద్యుత్తు కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ కందుకూరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.