హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం సృష్టిస్తున్నది. ప్లాట్ఫామ్పై ఒంటరిగా ఉన్న ఐదేండ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్తున్నట్లు అందులో తేలింది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపురం గ్రామానికి చెందిన మంగళి దుర్గేశ్ తన ఐదేండ్ల కుమారుడిని వెంటపెట్టుకుని తిరుపతికి వెళ్లాడు. ఈ నెల 28న తిరిగి ప్రయాణమయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు (Secunderabad Railway Station) చేరుకున్నాడు. రైలు దిగిన తర్వాత ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై బ్యాగుతోపాటు తన కుమారుడిని వదిలిపెట్టి వాష్రూంకు వెళ్లాడు. తిరిగొచ్చి చేసేసరికి తన కొడుకు కనిపించలేదు. స్టేషన్ మొత్తం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బాలుడ్ని ఎవరో గుర్తుతెలియని దంపతులు తీసుకెళ్లినట్లు కనిపించింది. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాలుడిని ఎత్తుకెళ్లిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
కాగా, దుర్గేష్, అతని కుమారుడి కదలికలను గమనించిన వ్యక్తులే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి కిడ్నాప్ వెనుక మరాఠా బెగ్గింగ్ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బృందాలుగా ఏర్పడిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.