కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రామడుగు : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెల్లరీలో ఆదివారం తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురు దొంగలు తమ రూట్ మార్చారు. ఎస్సారెస్పీ కాలువ వెంట ఉన్నరోడ్డు నుంచి పారిపోయినట్టు తెలిసింది. దొంగల ముఠా మహారాష్ట్రకు చెందినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. నగలు దొంగిలించి రెండు బైక్లపై దొంగలు పారిపోయారు. కరీంనగర్ శివారు మల్కాపూర్, బైపాస్ గుండా వెలిచాల క్రాస్రోడ్డు, అక్కడి నుంచి కొత్తపల్లి, రామడుగు మండలాల మధ్యగల ఎస్సారెస్పీ కాలువ దారిలో రామడుగు మండలంలోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు.
ఇదే మండలం రుద్రారం దగ్గర లభ్యమైన సీసీ పుటేజీ ప్రకారం చూస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో అదే గ్రామం నుంచి ఈ ముఠా రెండు ద్విచక్రవాహనాలపై వచ్చినట్టుగా తెలుస్తున్నది. దోపిడీ జరిగిన తదుపరి కూడా అదే గ్రామంపై నుంచి వెళ్లినట్టు గుర్తించారు. 25 బృందాలు దొంగలను పట్టుకోవడానికి జల్లెడ పడుతున్నాయి. దొంగలు వెళ్తున్నట్టు గుర్తించిన దారుల్లో ఉన్న సెల్టవర్ల నుంచి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. ఇక్కడి పరిసరాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఆ దొంగల సమూహంలో ఉండి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రహస్య దారులగుండా వెళ్లడంతోపాటు అందులో ఒకవ్యక్తి తెలుగు భాష మాట్లాడటంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.