కొత్తకోట, మార్చి 4 : పెండ్లి తేదీ ఖరారు చేసుకునేందుకు వెళ్తూ ఐదుగురు మృత్యువాత పడిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. ఎస్సై మంజునాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా బసవన్నకుంటకు చెందిన అలీకి హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన యువతితో పెండ్లి నిశ్చయం కాగా, నిశ్చితార్థానికి 12 మందితో కలిసి ఆదివారం రాత్రి కారు (కేఏ34పీ7323)లో హైదరాబాద్కు బయలుదేరారు. డ్రైవర్ అలీ నిద్రమత్తులో ఉండడంతో కొత్తకోట సమీపంలోని టెక్కాలయ దర్గా వద్ద 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రోషిణి (4), రుమానా (2), వాసిఫారిఫాత్ (7 నెలలు), సలీమాబీ(95), అబ్దుల్ రెహమాన్ (39) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు (షఫీ, హసన్, ఖదీర్, అలీ, హబీబా, షాజహానా) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కారులో 12 మంది ఉండగా ఏడేండ్ల సమీరా అనే చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూల్ దవాఖానకు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ రక్షితమూర్తి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కేఎస్ రత్నం తదితరులు ఉన్నారు.