హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతున్నప్పటికీ పలుof educational institutions యాజమాన్యాలు తమ బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించి మొత్తం 25,987 బస్సులు తిరుగుతుండగా.. వాటిలో ఇప్పటి వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్నవి 23,032 మాత్రమే. ఇంకా 2,955 బస్సులకు ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోలేదు. దీంతో అప్రమత్తమైన రవాణాశాఖ.. విద్యాసంస్థల బస్సుల తనిఖీలకు సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించింది. నేటి నుంచి విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతామని రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు నిర్వహిసున్నట్టు చెప్పారు. విద్యార్థులను రవాణాచేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని చంద్రశేఖర్గౌడ్ సూచించారు.
రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని పదే పదే చెప్పినా, కొన్ని యాజమాన్యాలు స్పందించడం లేదని, దీంతో ఏదైనా జరిగితే ఆయా యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని చంద్రశేఖర్గౌడ్ సూచించారు. ఫిట్నెస్ లేని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎకించే, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేకపోయినా, డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం లేమిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఫస్ట్ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సౌకర్యాలు, బ్రేకులు, టైర్లు, లైట్లు తదితర విషయాలనూ తీవ్రంగానే పరిగణిస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోకుండా ఉన్న 2,955 బస్సుల్లో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో ఉన్నట్టు రవాణశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఒక్క రంగారెడ్డి నుంచే 444 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి 419, వికారాబాద్ నుంచి 150, సంగారెడ్డి నుంచి 140, హైదరాబాద్ నుంచి 138, ఖమ్మం నుంచి 135, నల్లగొండ 115, హనుమకొండ 115, కరీంనగర్ 109, నిజామాబాద్ 104 చొప్పున బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు. ఎలాంటి విద్యా సంస్థలనైనా ఉపేక్షించేది లేదని, నిబంధనలు పాటించకపోతే కొత్త వాహనాల కొనుగోలు విషయంలో అనుమతుల రద్దుకు సిఫార్స్ చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు, ఓవర్ లోడ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు పెడతామని చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం డ్రైవర్లు, వాహన యజమానులు, విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించని, అధిక సంఖ్యలో విద్యార్థులను తరలించే వాహనాల్లో పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు రవాణ శాఖ సూచించింది.