Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 28: భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లు తుండటంతో గ్రామాల్లో చేపల పండుగ నెల కొన్నది. వరదల్లో ఎదురెక్కి వస్తున్న చేపలను మత్స్యకారులతోపాటు స్థానికులు పట్టుకెళ్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గుడి చెరువు, మూలవాగులో మత్స్యకారుల వలకు ఒక్కోటి 15 కిలోలు ఉన్న చేపలు చిక్కుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కింద ఉన్న చెక్డ్యామ్ వద్ద వందలాది మంది చేపలను పట్టేందుకు తరలివచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలంలోని చెరువులన్నీ దాదాపు మత్తడి దుంకుతుండగా, ఆయా గ్రామాల ప్రజలు రెండ్రోజుల నుంచి చేపల వేట సాగిస్తున్నారు. శుక్రవారం మండలంలోని ఏ ఇంట్లో చూసినా చేపల కూరనే వండి ఆస్వాదించారు.