హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ బస్పాస్’కు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్న సంస్థ.. తకువ దూరం ప్రయాణించే వారి కోసం రూట్ పాస్కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ తెలిపింది. నెలరోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్పాస్కు రూ.600గా, మెట్రో ఎక్స్ప్రెస్ రూట్ పాస్కు రూ.1000గా సంస్థ నిర్ణయించింది. ఐడీ కార్డుకు మరో రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
మొదట హైదరాబాద్లోని 162 రూట్లలో ఈ పాస్ను ప్రయాణికులకు ఇవ్వనున్నది. 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లయినా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్తో ప్రయాణించవచ్చని వెల్లడించింది. గతంలో ఉన్న పాస్ల మాదిరిగానే కొత్తగా తీసుకొచ్చిన రూట్పాస్ను ప్రయాణికులు ఆదరించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. బస్పాస్కు సంబంధించిన రూట్ల వివరాల కోసం www.tsrtc.telangana.gov.in,https:// online. tsrtcpass.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.
ఐపీఎల్ యాజమాన్యం పునరాలోచించుకోవాలి
హెర్బల్ లైఫ్ వంటి మోసపూరిత సంస్థలను అఫీషియల్ పార్ట్నర్గా పెట్టుకోవడంపై పునరాలోచించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎల్ యాజమాన్యానికి సూచించారు. హెర్బల్ లైఫ్ లాంటి గొలుసుకట్టు సంస్థలు అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని గురువారం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఐపీఎల్కు అఫీషియల్ పార్ట్నర్గా ఉన్నామంటూ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. హెర్బల్ లైఫ్ సంస్థపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, మోసాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.