హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ 1 ప్రారంభమైంది. తొలిరోజు పరీక్ష పేపర్పై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు. 2022 గణితం పేపర్తో పోలిస్తే.. అంత కఠినంగా లేదని తెలిపారు. ఫిజిక్స్ అత్యంత సులభంగా ఉన్నదని పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసే వీలుందని చెప్పారు. గణితం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించామన్నారు. ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీలు సహా కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు టాపర్లు 290 మార్కులు, మీడియం టాపర్లు 150 మార్కులు, స్లో లెర్నర్స్ 60కి పైగా మార్కులు సాధించే అవకాశం ఉన్నదని శ్రీచైతన్య ఆలిండియా ఐఐటీ కో ఆర్డినేటర్ ఎం ఉమాశంకర్ అంచనావేశారు. గణితం, రసాయనశాస్ర్తాలు స్కోరులో కీలకం కానున్నాయని తెలిపారు. గణితంలో ఎక్కువ గతంలోలానే ఉన్నాయని నానో అకాడమీ డైరెక్టర్ కృష్ణచైతన్య తెలిపారు. రెండో సెషన్లో కెమిస్ట్రీ పేపర్ కఠినంగా ఉన్నట్టు నిపుణులు అంచనావేశారు. గణితం కాస్త కఠినంగా ఉన్నా.. ఫిజిక్స్ మధ్యస్తంగా ఉన్నట్టు విశ్లేషించారు. ఈ సెషన్లో టాపర్లు 285 మార్కులు, మీడి యం టాపర్లు 135కి పైగామార్కులు, స్లో లెర్నర్లు 50కి పైగా మార్కులను స్కోర్ చేయొచ్చని పేర్కొన్నారు.
మొదటి సెషన్లో కొన్ని ప్రశ్నలు తేలికగా ఉన్నాయి. చాలా ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో వాటిని చదవడం, అర్థం చేసుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. త్రీడీ, వెక్టర్ ఆల్జిబ్రా, గణితం రీజనింగ్ ప్రశ్నలకు కష్టపడకుండా సమాధానాలిచ్చినట్టు విద్యార్థులు చెప్పారు. రెండో సెషన్లో నిడివి ఎక్కువున్నది. 10 ప్రశ్నలు కాస్త కఠినంగా, మరో 6 సులభంగా ఇచ్చారు.
మొదటి సెషన్లో ఫిజిక్స్లో ఎకువ ప్రశ్నలు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్ , మ్యాగ్నటిజం, మాడ్రన్ ఫిజిక్స్, ఈఎంఐ, న్యూక్లియర్ ఫిజిక్స్ , ఏసీ కరెంట్ నుంచి వచ్చాయి. థియరీ ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ఇచ్చారు. రెండో సెషన్లో మధ్యస్తంగా ప్రశ్నలొచ్చాయి. వీటిలో 10 నుంచి 12 ప్రశ్నలకు సులభంగా సమాధానాలు రాశామని విద్యార్థులు చెప్పారు.
మొదటి సెషన్లో ప్రశ్నలు సులభంగా వచ్చాయి. కానీ, కొన్ని విద్యార్థులను గందరగోళానికి గురిచేశాయి. ఆర్గానిక్, ఇనార్గానిక్ల నుంచి సమానంగా ప్రశ్నలొచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి తక్కువ ప్రశ్నలిచ్చారు. దాదాపుగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ప్రశ్నలిచ్చారు. కెమికల్ కైనెటిక్స్, గ్రాఫ్బేస్డ్ ప్రశ్నలు, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్ నుంచి ప్రశ్నలొచ్చాయి. రెండో సెషన్లో కెమిస్ట్రి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి.
జేఈఈ మెయిన్ -1 పరీక్ష ప్రారంభమైన తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎల్బీనగర్లోని పరీక్ష కేంద్రంలో సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష గంట పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. మౌలాలిలోని మరో పరీక్షకేంద్రంలో అరగంట ఆలస్యంగా పరీక్ష షురూ అయ్యింది. ఈ రెండు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యం కావడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఎట్టకేలకు పరీక్ష ప్రారంభంతో ఊపిరిపీల్చుకొన్నారు.