Assembly Session | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఒవైసీతో ఉదయం 8.30 గంటలకు స్పీకర్ ప్రొటెంగా రాజ్భవన్లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. ఆ వెంటనే శాసనసభ నియమావళిని అనుసరించి ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి లేఖలు రాశారు. మూడో శాసనసభ మొదటి సమావేశాన్ని పురస్కరించుకొని అసెంబ్లీకి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శాసనసభ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. సభ్యుల వాహన పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. స్పీకర్, ముఖ్యమంత్రి చాంబర్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పరిశీలించారు. సభ జరుగుతున్న సమయంలో శాసనసభ ప్రాంగణం, వెలుపల ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సభ వెలుపల ట్రాఫిక్ విధుల నిర్వహణ తదితర అంశాలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
ఈసారి అసెంబ్లీలో 51 మంది కొత్తవారు అడుగుపెడుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈసారి ఏకంగా 8మంది కొత్తవారు ఎన్నికయ్యారు. కొత్తగా అడుగుపెడుతున్న వారిలో 18మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి రాజకీయ రాజకీయ అనుభవం లేకపోవడం గమనార్హం. వీరందరూ తొలిసారి పోటీచేసి గెలుపొందినవారే.
శాసనసభకు ఎన్నికైన ప్రతి ఒక్కరు ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు శాసన సభ్యునిగా తాను ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రం (ఒరిజినల్)తోపాటు రెండు జిరాక్స్ కాపీలను శాసనసభ సచివాలయ అధికారికి సమర్పించాలి. ఒరిజినల్ పత్రాన్ని పరిశీలన అనంతరం తిరిగి ఎమ్మెల్యేకు అందజేస్తారు.
మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా ఉంటే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాక ఆయన చాంబర్లోనే ప్రమాణస్వీకారం చేస్తానని తేల్చి చెప్పారు. 2018 ఎన్నికల తర్వాత కూడా రాజాసింగ్ ఇలాగే చేశారు. అప్పటి ప్రొటెం స్పీకర్ ముంతాజ్ఖాన్ వద్ద ప్రమాణ స్వీకారం చేసేందుకు నిరాకరించిన ఆయన స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికైన తర్వాత ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతోమంది సీనియర్లు ఉండగా, వారందరినీ కాదని అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా ఎలా నియమిస్తారని ఈ సందర్భంగా రాజాసింగ్ ప్రశ్నించారు.
బీజేపీ శాసనసభాపక్ష నేతగా రాజాసింగ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. గోషామహల్ నుంచి మూడుసార్లు ఎన్నికైన ఆయన ప్రస్తుతం బీజేపీ శాసనసభ్యుల్లో సీనియర్. ఈ నేపథ్యంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా నియమించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
1) అలంపూర్ – విజయుడు
2) నారాయణపేట -పరిణితారెడ్డి
3) మక్తల్ -వాకిటి శ్రీహరి
4) దేవరకద్ర- మధుసూదన్రెడ్డి
5) వనపర్తి -తూడి మేఘారెడ్డి
6) జడ్చర్ల -అనిరుధ్రెడ్డి
7) కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి
1) పాలేరు -పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
2) వైరా- రాందాస్నాయక్
3) అశ్వరావుపేట – ఆదినారాయణ
4) సత్తుపల్లి -మట్టా రాగమయి
5) భద్రాచలం -తెల్లం వెంకట్రావు
1) వరంగల్ పశ్చిమ- నాయిని రాజేందర్రెడ్డి
2) వర్ధన్నపేట- కేఆర్ నాగరాజు
3) పాలకుర్తి -యశస్వినిరెడ్డి
4) మహబూబాబాద్ – మురళీనాయక్
5) డోర్నకల్ -రాంచంద్రనాయక్
6) భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణరావు
7) జనగామ- పల్లా రాజేశ్వర్రెడ్డి
1) హుజూరాబాద్ -పాడి కౌశిక్రెడ్డి
2) వేములవాడ-ఆది శ్రీనివాస్
3) కోరుట్ల- డాక్టర్ సంజయ్
4) మానకొండూర్ -కవ్వంపల్లి సత్యనారాయణ
5) రామగుండం-రాజ్ ఠాకూర్
6) ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్
7) చొప్పదండి-మేడిపల్లి సత్యం
8) హుస్నాబాద్ -పొన్నం ప్రభాకర్
1) సికింద్రాబాద్ కంటోన్మెంట్- లాస్య నందిత
2) మలాజ్గిరి -మర్రి రాజశేఖర్రెడ్డి
3) తాండూరు -మనోహర్రెడ్డి
4) ఉప్పల్- లక్ష్మీరెడ్డి
1) ఆదిలాబాద్ – పాయల్ శంకర్
2) బోథ్ – అనిల్జాదవ్
3) మంచిర్యాల- ప్రేమ్సాగర్ రావు
4) సిర్పూర్-హరీశ్
5) చెన్నూర్ -వివేక్
6) ఖానాపూర్-ఎడమ బొజ్జు
7) ముథోల్ – రామారావుపటేల్
1) దుబ్బాక -కొత్తప్రభాకర్రెడ్డి
2) మెదక్ – మైనంపల్లి రోహిత్రెడ్డి
1) ఆలేరు- బీర్ల ఐలయ్య
2) నాగార్జునసాగర్- జైవీర్రెడ్డి
3) మిర్యాలగూడ- బత్తుల లక్ష్మీరెడ్డి
4) భువనగిరి- కుంభం అనిల్రెడ్డి
5) తుంగతుర్తి- మందుల శామ్యేల్
1) కామారెడ్డి -వెంకటరమణారెడ్డి
2) ఆర్మూర్- రాకేశ్రెడ్డి
3) నిజాబాద్ రూరల్ – డాక్టర్ భూపతిరెడ్డి,
4) నిజామాబాద్ అర్బన్- సూర్యనారాయణగుప్తా
5) జుకల్ – లక్ష్మీకాంతారావు
6) ఎల్లారెడ్డి -మదన్ మోహన్రావు