హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): అగ్గిపెట్టెలో పట్టే చీర, శాలువ.. ఉంగరం, దబ్బడంలో దూరే చీరను తయారు చేసి రికార్డు సృష్టించిన రాజన్నసిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో వినూత్నతకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొదటిసారి సుగంధ ద్రవ్యాలతో పట్టుచీరను రూపొందించారు. పరిమళించే ఈ చీరను పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు ‘సిరి చందన’ పట్టుగా మంత్రులు నామకరణం చేశారు. చీర తయారీలో ప్రకృతి సిద్ధమైన రంగులు, 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించారు.
ఏడాదిపాటు సువాసనలు
నూలుతోపాటు సుగంధ ద్రవ్యాలైన శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచి, జటామాంస, బావంచాలు, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, కోషం, తుంగదుంపలు, గంధం, కచోరాలు, ఎర్రచందనం, కస్తూరి పసుపు, బట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రెక్కలు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి తదితర వాటితో ఉడకబెట్టి ఈ చీరను తయారు చేశారు. ఉతికినప్పటికీ దీని సువాసనలు ఏడాదిపాటు ఉంటాయి. పూర్తి పట్టుతో నేసేందుకు నాలుగురోజులు పట్టినట్టు తయారీదారుడు విజయ్ తెలిపారు. త్వరలో పూర్తి బంగారు చీర తయారు చేస్తానని, తన చీరల తయారీ యూనిట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్టు వివరించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని రాష్ట్ర మంత్రులు కే తారక రామారావు, టీ హరీశ్రావు చెప్పారు. శనివారం ప్రగతిభవన్లో మంత్రులతోపాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నాయకులు, టీఎంయూ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై అంశాలవారీగా చర్చించారు. అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రులు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా చేస్తామని నేతలకు హామీఇచ్చారు. సీఎం కేసీఆర్తో మాట్లాడిన అనంతరం త్వరలో మరో సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించుకుందామని మంత్రులు తెలిపినట్టు ఆర్టీసీ కార్మిక నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో సమాఖ్య చైర్మన్ కే రాజిరెడ్డి, సలహాదారులు బూడిద జగన్మోహన్రెడ్డి, కత్తుల యాదయ్య, సురంటి మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ కొవ్వూరు యాదయ్య, కో కన్వీనర్ కే రామదాసు, కోశాధికారి కంది రవీందర్రెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు కమలాకర్గౌడ్, ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి, ముఖ్య సలహాదారులు ఎల్ మారయ్య, బీ యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు జీ పరుశాంరెడ్డి ఉన్నారు.