హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. లెక్కింపునకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 5 గంటలకే సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్ నియోజకవర్గాల్లో వెలువడనుండగా, చివరగా శేరిలింగంపల్లిలో ఫలితం తేలనుంది. భద్రాచాలంలో 13 రౌండ్లలో కౌంటింగ్ జరుగనుండగా, చార్మినార్లో 14 రౌండ్లు.. శేరిలింగంపల్లిలో 23 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 119 స్థానాల్లో 1798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 2417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ఆధిక్యం ఉదయం 10.30 గంటలకు వస్తుంది. అదేవిధంగా చిన్న నియోజకవర్గాల్లో 10.30 గంటలకే తొలిరౌండ్ ఫలితాలు రానున్నాయి. కాగా లెక్కింపు కేంద్రాల వద్ద 40 కంపెనీల భద్రత సిబ్బందిని మోహరించారు. స్ట్రాంగ్రూమ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.