హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నిర్వహించిన సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 25 వరకు జరిగిన ఈ హ్యాకథాన్లో మొత్తం మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతల జాబితాను సీసీటీఎన్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసూన్ గుప్తా బుధవారం వెల్లడించారు. విధుల నిర్వహణలో పోలీసులకు ఉపయుక్తంగా ఉండే సరికొత్త అప్లికేషన్ల తయారీ విభాగంలో తెలంగాణ అగ్రస్థానాన్ని కైవసం చేసుకొన్నది. సైబర్ క్రైం అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం (సైకాప్స్) టూల్ను అందుబాటులోకి తెచ్చిన ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ దేవేందర్సింగ్కు ఈ ఘనత దక్కింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో హర్యానా పోలీసులు రూపొందించిన యాప్స్ నిలిచాయి. సీసీటీఎన్ఎస్ బగ్ హంటింగ్ విభాగంలో సగే యూనివర్సిటీ విద్యార్థి ఎస్ శర్మకు మొదటి బహుమతి, ఇన్నోవేటివ్ సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీస్ విభాగంలో సీబీఐ ఢిల్లీ యూనిట్కు చెందిన ఎస్పీ ప్రవీణ్ మండ్లోయికి ప్రథమ బహుమతి లభించింది.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నిర్వహించిన సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్-2022లో జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీస్శాఖకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పోలీస్శాఖ సాధించిన విజయాన్ని డీజీపీ మహేందర్రెడ్డి బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. డీజీపీ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించడంతోపాటు పోలీస్శాఖను అభినందించారు. తెలంగాణ పోలీస్ టూల్కు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు.