సిద్ధిపేట : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300కోట్లతో 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి హరీశ్రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని సిద్ధిపేట జిల్లాలో ప్రారంభంకావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నామన్నారు. గతంలో కిరణ్కుమారెడ్డి మీకు చీకటే.. కరెంటు ఎక్కడ అని అన్నారని.. ఇప్పుడు ఏపీలో చీకటి ఉందని.. సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల కరెంటు ఇచ్చి చూపించారన్నారు. అలాగే ఎకరానికి రూ.10వేల పెట్టుబడి ఇచ్చారన్నారు.
వ్యవసాయం చేసే రైతులు నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆనందమని, రైతులు వరి అని ఒకటే పంట వేస్తున్నరని.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతేరాజు కావాలన్నది కేసీఆర్ కల అన్నారు. వరి వేస్తే రూ.25వేల వరకు మిగులుతుందని, కానీ రైతు ఆదాయం పెరగాలన్నదే మా తన్నులాట అన్నారు. అందు కోసమే మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో ఆయిల్పామ్ జిల్లాగా డిక్లేర్ చేయించామన్నారు. ఎకరానికి రూ.80వేల సబ్సిడీ ఇస్తు్న్నట్లు పేర్కొన్నారు. డ్రిప్ కంపెనీలకు సబ్సిడీ పెంచామన్నారు. ఖమ్మం జిల్లాకు చాలా మందిని పంపామని, కళ్లతో చూసి వచ్చారన్నారు. కోతులు, పందులు, చీడపీడ లేని పంట.. ధర రాదనే బాధ లేదన్నారు.
ఎకరానికి తక్కువలో తక్కువ రూ.1.50లక్షల వరకు నికరంగా లాభం వస్తుందన్నారు. పంట కొనేది ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ సంస్థ అనీ, ఫ్యాక్టరీ మన జిల్లాలోనే ఉందన్నారు. గవర్నమెంట్ ఉద్యోగికి ఎంత జీతం వస్తదో.. ఆయిల్ పామ్ రైతుకు అంతే వస్తదని చెప్పారు. దేశం లక్షలకోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటుందని, మన దేశంలో పండకనే ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. నూనె పంటల సాగు దేశంలో తక్కువని, పామాయిల్కు మంచి డిమాండ్ ఉంటదన్నారు. రైతులు పంటలు వేస్తే బాగుపడుతారని, జూలై కల్లా 20వేల ఎకరాలకు మొక్కలు రెడీగా ఉన్నాయని, ఇప్పటికే 3వేల ఎకరాల్లో పంటవేశారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రతీ మండలంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రం ప్రభుత్వం తొండాట ఆడుతుందని, యాసంగి పంట అంటేనే బాయిల్డ్ రైస్ అన్నారు. రా రైస్ పట్టిస్తే నూకలు ఎక్కువ, బియ్యం తక్కువ అనీ, పండేది బాయిల్డ్ రైస్ ఇస్తమంటే.. రా రైస్ కొంటామంటున్నారన్నారు. కొంటమని చెబుతరు.. బాయిల్డ్ రైస్ కొనం అంటున్నరని.. నోటితో చెప్పి నొసటితో ఎక్కిరించినట్లు కేంద్రం వ్యవహారం ఉందని విమర్శించారు. నూకలు ఎంత ఖర్చయితే అంత రూ.2వేలకోట్లా.. రూ.3వేల కోట్ల నష్టం భరిద్దాం.. రైతును నిలబెడుదాం అని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమస్య సృష్టిస్తున్నారని, తెలంగాణ పంట్ల వాళ్ల కళ్లు మండుతున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింట్లో నెంబర్ అనీ, తలసరి ఆదాయంలో, ఆర్థిక వృద్ధిరేటులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి రూ.10వేలు ఇవ్వడంలో, రైతులు చనిపోతే రూ.5లక్షల బీమా ఇవ్వడంలో నెంబర్గా ఉందన్నారు. అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ఢిల్లీలోని బీజేపీ నేతలకు ఏమని తిట్టాలో అర్థం కావడం లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అన్నింట్లో నెంబర్ అన్నారు. ఈర్ష్య, అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని, అందులో ఒకటి వడ్లు అనీ, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో అశాంతి రావాలి, తక్కువ ధరకు రైతులు అమ్ముకొని నష్టపోవాలనే ఉద్దేశం వారిదన్నారు. బీఆర్జీఎఫ్లో రూ.1350 కోట్లు ఇవ్వాలి.. 50 దరఖాస్తులు పెట్టినం.. ఇవ్వడం ఆపేశారు.. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు ఇవ్వాలంటే ఇవ్వలేదని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, అప్పులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరని, బాయిలకాడ మీటర్లు పెడితే రూ.25వేలకోట్ల అప్పు ఇస్తామంటున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ బాయిలకాడ మీటర్లు పెట్టేది లేదని చెప్పారని, ఇవన్నీ రైతులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రైతుల కోసం ప్రభుత్వం పని చేస్తుందని, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, మీ పాలనలో ఒక్క మడి కూడా ఎండకుండా పంట పండిందా ? కరెంటు కోతలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు,న నెర్రలు బాసిన నెలలు కనిపించేవని గుర్తు చేశారు. ఇంకా అధికారంలోకి వస్తా అంటున్నరని.. మీకు ఏం చూసి ఓటెయ్యాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే చరిత్ర కోసం మాట్లాడలి తప్ప భవిష్యత్తు లేని పార్టీ అన్నారు. రైతులకు సీఎం కేసీఆర్పై సంపూర్ణ విశ్వాసం ఉందని, అందుకే రైతు నష్టపోవద్దని 2వేల కోట్లయినా నూకల నష్టం భరిస్తామని ప్రకటించారన్నారు.