ఖమ్మం సిటీ, మే 26: రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో పిల్లల కోసం ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటుచేశారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పరిధిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్ను బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ.. థర్డ్వేవ్ ప్రభావం చిన్నారులపై ఉన్నదని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో 40 పడకల వార్డు ఏర్పాటుచేశామని చెప్పారు. 12 ఏండ్ల లోపు పిల్లలకు కరోనా సోకితే ఇక్కడ ఉచితంగా వైద్యం చేస్తామని పేర్కొన్నారు. యావత్ తెలంగాణలోనే ఇది మొట్టమొదటి చిల్ట్రన్ కొవిడ్ కేంద్రమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీఎంహెచ్వో మాలతి తదితరులు పాల్గొన్నారు.