అచ్చంపేట, ఫిబ్రవరి 7: వేరుశనగ ధర ఒక్క రోజులోనే భారీగా పడిపోవడంతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం రూ.8 వేలకుపైగా పలికిన క్వింటా పల్లీ ధర.. మరుసటి రోజుకే రూ.వెయ్యి తగ్గడంతో అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 421 మంది రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట గంటపాటు బైఠాయించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని రోడ్డుపై వేరుశనగ పంటను నడిరోడ్డుపై పోసి నిప్పు పెట్టారు.సీఎం రేవంత్రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.