హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో అత్యంత కీలకమైన డాటాను నిల్వచేసే సర్వర్ రూమ్ కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సర్వర్లోని డాటాను బ్యాకప్ చేశారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. సర్వర్రూమ్లో ఉండే డాటాను.. బ్యాకప్ చేయడం కోసం క్లౌడ్ సర్వర్లను ఉపయోగిస్తుంటారు. తెలంగాణ ఎఫ్ఎస్ఎల్లోని డాటా విషయంలో ఆ ఏర్పాటు జరిగిందా లేదా? అన్న దానిపై డీజీపీ శివధర్రెడ్డి ప్రెస్మీట్లో స్పష్టత లభించలేదు. వేల సంఖ్యలో కేసులకు సంబంధించిన డాటా బ్యాకప్ గురించి మీడియా ప్రశ్నించగా.. కాలిపోయిన సర్వర్ల నుంచే డాటాను రిట్రీవ్ చేస్తున్నామని డీజీపీ చెప్పడంపై నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్రెడ్డిని ‘మీ దగ్గర బ్యాకప్ పాలసీ ఏమైనా ఉందా? ఫైళ్ల బ్యాకప్ పరిస్థితి ఏంటి? సర్వర్ల నుంచి రిట్రీవ్ చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా.. ‘సర్వర్ల నుంచే రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం నిపుణులను పిలిపించాం. బయటి నుంచి కూడా ఎక్స్పర్ట్స్ను రప్పించి సర్వర్ల నుంచి డాటా రిట్రీవ్ చేస్తున్నాం’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఎంతో కీలకమైన డాటా తిరిగి లభిస్తుందా అన్న అంశం అనుమానాస్పదంగా మారింది.
‘ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం గురించి డీజీ శిఖాగోయెల్ పూర్తిగా సమాచారాన్ని పంచుకున్నారు. అయితే, ప్రస్తుతం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఒక నిపుణుడు వచ్చాడు. నాగ్పూర్లో ఫైర్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు వచ్చారు. సీఎఫ్ఎస్ఎల్ అధికారులు, మన అధికారులు, ఫైర్ నిపుణులు కలిసి అగ్ని ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే వాస్తవాలు బయటికి వస్తాయి. పాత కేసులకు సంబంధించిన ఆధారాలు పోయాయని కొందరు ఆరోపిస్తున్నారు. అవన్నీ అబద్ధం. 2021 వరకూ మొత్తం కోర్టుకు అప్పగించాం. మా దగ్గర ఎలాంటి మెటీరియల్ లేదు. అన్ని వాయిస్ రికార్డులు కూడా కోర్టుకు ఇచ్చాం. ఫోన్ట్యాపింగ్ కేసుల్లో కూడా రిపోర్టులు సంబంధిత అధికారులకు పంపించాం. మా దగ్గర ఏమీ లేవు. అయితే, కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి.. నిపుణులతో వాటిని పరీక్షిస్తున్నాం. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి సీన్ను డిస్టర్బ్ చేయొద్దని సూచించారు కాబట్టి.. కొంత సమయం పట్టే అవకాశం ఉంది’ అని డీజీపీ శివధర్రెడ్డి ఏ అంశంపైనా కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ‘దేశానికే తలమానికంగా ఉన్న ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. లోపం ఎక్కడ ఉంది?’ అన్న ప్రశ్నకు.. ‘ఆ లోపం ఎక్కడ జరిగిందనే దానిపైనే దర్యాప్తు చేస్తున్నాం. ఎఫ్ఎస్ఎల్లో భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైనే ఆరా తీస్తున్నాం’ అని చెప్పారు.