హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆల్విన్ హెర్బల్ పరిశ్రమలో (Allwyn Pharma) మళ్లీ మంటలు వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. దీంతో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. శనివారం సాయంత్రం హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. మంటల ధాటికి ఏసీలు ఒక్కసారిగా పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నారు. దీంతో భయాందోళనకు గురైన పలువురు కార్మికులు కిటికీల్లోంచి దూకి తప్పించుకున్నారు.
శనివారం ఉదయం వరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మళ్లీ మంటలు వ్యాపించడంతో కంపెనీ పరిసర ప్రాంతాల్లోకి సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు. ఈ అగ్నిప్రమాదంలో పరిశ్రమ ఉత్పత్తుల భవనం, కార్యాలయం ఇప్పటికే అగ్నికి ఆహుతయ్యాయి.