బజార్ఘాట్: నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. వారిలో కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక నాలుగు రోజుల పసికందు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అపార్టుమెంటు ముందు పార్క్ చేసి ఉన్న ఒక కారు, ఆరు ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ప్రమాదం జరగగానే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. అపార్టుమెంటులో చిక్కుకున్న 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని మధ్యమండల డీసీపీ వేంకటేశ్వర్రావు తెలిపారు. గ్యారేజీ సమీపంలో డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకుని అపార్టుమెంటు పైఅంతస్థులకు వ్యాపించాయని చెప్పారు. అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్లలో అద్దెకు ఉండే కుటుంబాలు మంటల్లో చిక్కుకున్నాయన్నారు.
కాగా, అపార్టుమెంటు ఓనర్ రమేశ్ జైశ్వాల్కు కెమికల్ కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో అపార్టుమెంటు సెల్లార్లో అతను 130 డ్రమ్ముల కెమికల్ను నిలువచేశారు. పాస్టిక్ తయారీకి వినియోగించే ఈ కెమికల్ డ్రమ్ముల్లో 30 డ్రమ్ములకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆలోపే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూనే కాలిపోకుండా ఉన్న మిగతా డ్రమ్ములను బయటకు తీసుకొచ్చారు.
కాగా, ప్రమాదం అనంతరం ఆపార్టుమెంటు ఓనర్ రమేశ్ జైశ్వాల్ పరారయ్యాడు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
#WATCH | Six people have died in a fire at a godown located in an apartment complex in Bazarghat, Nampally of Hyderabad, says DCP Venkateshwar Rao Central Zone. pic.twitter.com/sXepmTPB2f
— ANI (@ANI) November 13, 2023