మహదేవపూర్, మే 24 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి శివారులో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ గెస్ట్హౌస్ ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంటనే కంపెనీ ప్రతినిధులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే 12 గదులు, వాటిలో ఉన్న కంప్యూటర్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ ఘటనపై బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధి రత్నంను వివరణ కోరగా.. ఎల్అండ్టీ కంపెనీ విశ్రాంతి భవన సముదాయానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో వరికొయ్యలకు నిప్పు పెట్టగా, గాలి దుమారంతో ఒక్కసారిగా మంటలు ఎల్అండ్టీ విశ్రాంతి భవన సముదాయంలోకి వ్యాపించాయని తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేసి, గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా మంటలు చెలరేగి 12 గదులు, విలువైన సామగ్రి కాలిపోయాయని, నష్టంపై అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ గెస్ట్హౌస్ మేడిగడ్డ బరాజ్కు సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్నది. ప్రస్తుతం బరాజ్ వద్ద ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ) ఆధ్వర్యంలో ఎన్జీటీ, జీపీటీ, జియోటెక్నికల్తోపాటు పలు సాంకేతిక పరీక్షలు నెల రోజులుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎల్అండ్టీ కంపెనీకి చెందిన గెస్ట్హౌస్, అందులోని సామగ్రి మంటల్లో కాలి బూడిదకావడం కలకలం రేపింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా కావాలనే చేసి ఉంటారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. 2023 అక్టోబర్ 22న బరాజ్లో భారీ శబ్దంతో పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా, బరాజ్ వద్ద ఉన్న నిర్మాణ సంస్థ సముదాయంలో మంటల చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.