హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కరోనా కాలంలో కూడా తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అమాయకుల ను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా గా వారు ఆక్సిమీటర్ల ద్వారా వల విసురుతున్నారు. తాము తయారుచేస్తున్న ఆక్సిమీటర్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఈ ఆక్సిమీటర్లలో వారు ఒక కార్డ్ రీడర్ను అమరుస్తున్నా రు. వీరు విక్రయించే ఆక్సిమీటర్ 15 రోజులే పనిచేస్తుంది. దానిని అమ్మే సమయంలోనే.. ‘ఏదైనా సమస్య వస్తే.. ఆక్సిమీటర్ను రీప్లేస్ చేస్తాం’ అని వారు హామీ ఇస్తారు. ధర ఎక్కువపెట్టి కొనుగోలుచేసిన వినియోగదారుడు అది చెడిపోగానే తిరిగి వీరినే సంప్రదించాల్సి వస్తుంది. ఆక్సిమీటర్ తమవద్ద ఉన్న సమయంలో వినియోగదారులు కచ్చితంగా దాని లో తమ వేలుపెట్టి ఆక్సిజన్ స్థాయిని పరీక్షించుకుంటారు. ఆ సమయంలోనే వీరి వేలిముద్రలు అందులోని కార్డ్రీడర్లోకి వెళ్లిపోతాయి. ఆక్సిమీటర్ చెడిపోయిందని ఫోన్ చేయగానే వాళ్లు వచ్చి పాతది తీసుకొని కొత్తవి ఇస్తారు.
వెనక్కి తీసుకున్న ఆక్సిమీటర్లోని కార్డ్రీడర్లను వెలికితీసి వాటిలోని మన వేలిముద్రలను సేకరిస్తారు. ఆ తర్వాత డార్క్నెట్ లేదా ఇతర వ్యక్తుల ద్వారా సిమ్ కార్డు డాటాను తీసుకుంటారు. ఆ డాటాలో మన వేలు ముద్రలను బట్టి మన ఫోన్నంబర్లను సేకరిస్తారు. లేదా మన ఆధార్ సమాచారం తీసుకుంటారు. వీటి ద్వారా వారికి మన బ్యాంక్ ఖాతాల వివరాలు తెలిసిపోతాయి. అలా వారు బ్యాంక్ ఖాతాలను జల్లెడ పట్టి వాటి ద్వారా మన డబ్బును దోచేందుకు కుట్రలు పన్నుతుంటారు. ఇలా ఆన్లైన్లో ఆక్సిమీటర్లు కొనుగోలుచేసిన వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిన కేసులు ఇటీవల భారీగా నమోదవుతున్నాయి.