హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగంలో ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. సాంకేతికతను ఉపయోగించి చాలెంజింగ్ కేసులను సులువుగా పరిష్కరిస్తుండటం పట్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధికారులు ఈ అవార్డును అందజేశారు. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫింగర్ ప్రింట్స్ బ్యూరో (ఎఫ్పీబీ) డైరెక్టర్ల 24వ అఖిల భారత కాన్ఫరెన్స్ ఈ నెల 6, 7న న్యూఢిల్లీలో నిర్వహించగా, ఇందులో రాష్ర్టానికి అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్ తండాలో 2020లో ప్రసాదంలో మత్తుమందు పెట్టి దంపతులను హతమార్చి, నగదు, ఆభరణాలు దొంగిలించిన కేసును ఖమ్మం ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్స్పెక్టర్ (ఎక్స్పర్ట్) బీ నరేశ్ సులువుగా ఛేదించారు.
అప్పటికే స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇన్స్పెక్టర్ నరేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రాథమికంగా వేలిముద్రలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, యోగిందర్ అనే వ్యక్తి అరెస్టుకు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం అతడికి ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించింది. తెలంగాణ సీఐడీ అధికారుల పనితీరుకు ఎన్సీఆర్బీ అధికారులు జాతీయస్థాయిలో గుర్తించి అవార్డు అందించారు. తెలంగాణ రాష్ట్రం స్మార్ట్ ఇన్వెస్టిగేషన్లో ద్వితీయస్థానం దక్కిందని కొనియాడారు. ఈ సందర్భంగా ఫింగర్ ప్రింట్స్ బ్యూరో డైరెక్టర్ తాతారావు, సిబ్బందిని గురువారం తన కార్యాలయంలో డీజీపీ అంజనీకుమార్, మహేశ్ భాగవత్ అభినందించి, మెమెంటో అందించారు. కేసుల పరిష్కారంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.