హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): సన్న ధాన్యం బోనస్ బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రైతులకు బోనస్ కింద రూ.1939.58 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 1425.22 కోట్లు మాత్రమే జమచేసింది. నెలరోజుల తర్వాత మిగిలిన బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేసింది. గత యాసంగి బోనస్ బకాయిలు రూ. 1159 కోట్లు పెండింగ్లో ఉంచడం గమనార్హం. ఆ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊసెత్తడంలేదు. దీంతో అవి శాశ్వత బకాయిలుగా మిగిలిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యాసంగి బోనస్ బకాయిలను సైతం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.