మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్, ఆగస్టు 11: పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ కులవృత్తుల వారికి రెండో విడత కింద 250 మంది లబ్ధిదారులకు శుక్రవారం రూ.2.5 కోట్ల విలువైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 500 మందికి చెక్కులను అందించినట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు దాన్ని రాజకీయం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా సాయం అందజేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసినా, ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.