సిద్దిపేట, మార్చి 26: సీఎం కేసీఆర్ అందిస్తున్న చేయూతతో తెలంగాణలో వ్యవసాయరంగం అద్భుత ప్రగతి సాధించి దేశానికే దిక్సూచిగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ఈ యాసంగిలో దేశం మొత్తంలో 97 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడితే, అందులో ఒక్క తెలంగాణలోనే 56 ల క్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. పక్క నే ఉన్న ఏపీలో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కావడంతో తెలంగాణ వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా మారిందని అన్నారు. అందుకే దేశం మొత్తం ఆబ్కీ బార్ కిసాన్ సర్కారు అని నినదిస్తున్నదని తెలిపారు. ఆదివారం సిద్దిపేట వ్యవసాయ మార్కె ట్ కమిటీ ఆవరణలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మతో కలిసి 763 మంది రైతులకు స్ప్రిం క్లర్లను అందజేశారు ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రైతుల కోసం ఏదైనా చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతి రైతు గుండెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. ప్రతి ఊర్లో కాంటా పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు తంటాలు లేకుండా చేశారని తెలిపారు. యాసంగి ధాన్యం కొనడంలో మళ్లీ కేంద్రం చేతులెత్తేసిందని ఆరోపించారు. దేశం లో రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యు త్తు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు సరిపోవంటున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర నుంచి మరో రూ.10 వేలు ఇప్పించాలని హితవు పలికారు. పంట నష్టపోయిన రైతులకు రూ.225 కోట్ల నిధులు సీఎం కేటాయించినట్టు చెప్పారు. బీజేపోళ్లకు ఇవ్వడం చేతకాదు కానీ మాటలకేం తక్కువ లేదని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టులను యుద్ధ్దంలా పూర్తిచేసి నీరందిస్తే.. ఢిల్లీలో కూర్చోని ఒకడు, హైదరాబాద్లో కూర్చోని మరొకడు.. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు నీరు రావడం లేదంటూ ఇష్టారీతిగా మాట్ల్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పొలాల వెంట పారుతున్న నీళ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నీళ్లు రాలేదంటున్న నాయకులను తెచ్చి కాల్వల్లో ముంచాలని సూచించారు. ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలు నాట్లు వేసేందుకు తెలంగాణకు వస్తున్నారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ మాదిరి పథకాలు తమకూ కావాలని రైతులు దేశంలో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. అందుకే దేశం మొత్తం ఆబ్కీ బార్ కిసాన్ సర్కారు అని నినదిస్తుదని అన్నారు. ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలోని పెద్దవాగు, మందపల్లి వాగు మానేరులో కలిసి గోదావరిలో కలిసేవని, నేడు గోదావరి జలాలు వచ్చి ఈ వాగుల్లో పారుతున్నాయని, ఇదంతా కేసీఆర్ కృషి ఫలితమేనన్నారు.
ఒకప్పుడు నీళ్లు లేక పంటలు ఎండిపోయి అప్పుల పాలైతే భూమి అమ్ముదామంటే కొనేవారు ఉండేవారు కాదని మంత్రి తెలిపారు. నేడు రూ.30-40 లక్షలకు ఎకరం భూమి కొంటామన్నా రైతులు అమ్మడం లేదని అన్నారు. పుష్కలంగా నీరు అందుబాటులో ఉండటం, పంటలు బాగా పండుతుండటంతో రైతుల పరపతి పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 200 స్ప్రింక్లర్ సెట్లు వచ్చేవని, నేడు ఒకఊరికి 200 సెట్లు ఇస్తున్నామని తెలిపారు. నాడు కాంగ్రెస్ పాలనలో ప్రజల కోసం గంజి కేంద్రాలు, పశువుల కోసం గడ్డి కేంద్రాలను పెట్టిన రోజులు ఉండేవని గుర్తుచేశారు. నాడు ఎట్లా ఉండేది.. నేడు ఎట్లా ఉందో రైతులు ఆలోచించాలన్నారు.