సిద్దిపేట, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తాము దేశంలో ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రగతి గురించే అడిగి తెలుసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఢిల్లీలో వివిధ సమావేశాలకు వెళ్లినప్పుడల్లా తెలంగాణ లో ఇన్ని పథకాలు ఎలా అమలుచేస్తున్నారని వివిధ రాష్ర్టా ల మంత్రులు అడుగుతున్నారని చెప్పారు. మహారాష్ట్రలో ఇంత అభివృద్ధి ఎందుకు లేదని అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, అలాంటి నేత తమకు కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్’ మండల స్థాయి అవార్డులను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఇతర ప్ర జాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రదానం చేశారు. అంతకుముందు సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్రం దేశంలో 10 ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే.. అందులో ఏడు తెలంగాణకు దక్కాయని చెప్పారు. కేంద్రం ఏ అవార్డులు ఇచ్చినా తెలంగాణ ఉండాల్సిందేనని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నదని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే, ఇక్కడి గల్లీ లీడర్లు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ నుంచి నేరుగా పంచాయతీ అకౌంట్లోనే నిధులు జమ చేస్తామని, వీటిని గ్రామాభివృద్ధికి వాడుకోవచ్చునని స్పష్టంచేశారు.
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ మంచి మనసు చాటుకున్నారని హరీశ్రావు కొనియాడారు. సీఎం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఎంత ఇబ్బంది ఎదురైనా రైతులకు నాణ్యమైన కరెంటును పగటి పూట ఇస్తున్నామని తెలిపారు. కరెంటు కోసం నెలకు రూ.1,500 కోట్లు భరించి రైతులకు ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. రోజుకు సరాసరిగా కరెంటు కోసం రూ. 60 కోట్ల నుంచి రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు.
సీఎం కేసీఆర్ నదికే నడక నేర్పారని, ఇలా జరుగుతుందని వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞాన చరిత్రలో కూడా రాయలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరువు పూర్తిగా పోయిందని హరీశ్రావు అన్నారు. తెలంగాణలో కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో యాసంగిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఏపీలో 16 లక్షల ఎకరాల్లోనే సాగైందని వివరించారు. ఎనిమిదేండ్లలో 70 ఏండ్ల అభివృద్ధిని చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టంచేశారు. దీన్ని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తల, తోక లేకుండా మాట్లాడుతన్నారని విమర్శించారు.