ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మిగిలాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నా రు. ఖమ్మం జిల్లా కల్లూరులో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకు లు ఢిల్లీ నేతలకు, బీజేపీ నాయకులు గుజరాత్ నేతలకు గులాంగిరీ చేస్తున్నారని, కానీ బీఆర్ఎస్కు మాత్రం ప్రజలే హైకమాండ్ అన్నారు. బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని.. డబుల్ స్టాండర్డ్ సర్కారుగా విమర్శించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిైట్లెనా వస్తాయా? అని అప్పట్లో కొందరు హేళన చేశారని, కానీ ఇప్పుడు ఇదే జిల్లాలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగిందని అన్నారు. నిజం చెప్పకుండా ఉంటే అబద్ధాలు రాజ్యమేలుతాయని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నాడే చెప్పారని, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సగర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం లో సాగు పండుగ అయ్యిందన్నారు. ప్రస్తుత మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఉమ్మడి పాలనలోనూ ఉన్నత పదవుల్లో కొనసాగారని, కానీ మధిరకు కనీసం వంద పడకల దవాఖాన తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కొత్తగూడెం, ఖమ్మానికి ఎందుకు మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. రెండో విడత కంటివెలుగులో రాష్ట్రవ్యాప్తంగా రూ.1.17 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, వీరిలో 30 లక్షల మందికి కంటి అద్దాలు అందజేశామని తెలిపారు. అంతకుముందు మంత్రి హరీశ్రావు ఖమ్మం జిల్లా కల్లూరు, పెనుబల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ వైద్యశాలల నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సుదీర్ఘ కాలంపాటు పరిపాలించినా మెడికల్ కళాశాలల ఏర్పాటు విషయాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాకు ఒక్కో మెడికల్ కళాశాల మంజూరైనట్టు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పాల్గొన్నారు.కాగా హనుమకొండలోని రాయల్ గార్డెన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 49, 50వ డివిజన్ల బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొన్నారు.